వైసీపీ నేతకు మంత్రి తనయుడి బెదిరింపు .. వివాదాల్లో మంత్రి

ఏపీ మంత్రుల త‌న‌యుల ఆగ‌డాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కారులో వెళుతూ ఒక మ‌హిళ‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించి ఒక మంత్రి త‌న‌యుడు వార్త‌ల్లోకెక్కారు! ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల త‌న‌యులు ఒక గ్రూపుగా ఏర్ప‌డి సెటిల్‌మెంట్ల‌కు పాల్పడుతూ మరో సీనియ‌ర్ మంత్రికే షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలోకి మంత్రి బొజ్జ‌ల త‌న‌యుడు కూడా చేరిపోయారు. వైసీపీ నేతను చంపేస్తాన‌ని బెదిరించిన సంఘ‌ట‌న ఇప్పుడు క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అలాగే మంత్రి భార్య కూడా అధికారుల‌పై బెదిరింపుల‌కు పాల్ప‌డారు. దీంతో మంత్రి కుటుంబం చిక్కుల్లో ఇరుక్కుంది.

రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి బొజ్జ‌ల గోపాల కృష్ణ త‌న‌యుడు సుధీర్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చి కలకలం సృష్టించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఈ నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో సహా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో లేపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోలేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. ‘ఆలయంలో పాలనా వైఫల్యాలపై మాకు సూచనల వరకు ఒకే గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు’ అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేయగా.. బృందమ్మ మాత్రం అదే తీరుగా వ్యవహరించడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్ధం కావాల్సి వచ్చింది.

తరచుగా టీడీపీ నేతలు, మంత్రులు.. వారి సన్నిహితులు మహిళలు, అధికారులపై దాడులకు పాల్పడుతూ వివాదాల‌కు కేంద్ర బిందువులుగా మారుతున్నారు. మొత్తానికి అటు త‌న‌యుడు, ఇటు స‌తీమ‌ణి ఇలా వివాదాల్లో చిక్కుకుని మంత్రికి ఇబ్బందులు తీసుకొస్తున్నారు.