ప్రస్తుతం తెలుగు మీడియాలో చాలా పత్రికలు పార్టీలకు కరపత్రికలుగా మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలు – పత్రికలు కరపత్రికలు అన్న అంశంపై తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా చర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయిందన్నది నిజం. ఈ క్రమంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు తమ సభలు, సమావేశాలకు అనుమతించడం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థలను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు.
గతంలో సాక్షి మీడియాను చంద్రబాబు మహానాడుకు రావొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు అప్పట్లో సాక్షి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఆంధ్రజ్యోతి వంతు వచ్చింది. ఏపీలో అధికార టీడీపీ డప్పు కొడుతూ, బాకాలు ఊదేస్తోన్న ఆంధ్రజ్యోతి మీడియాను వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్లీనరీకీ రాకుండా నిషేధం విధించారు. తమ ప్లీనరీ కవరేజ్కు వైసీపీ ఆంధ్రజ్యోతితో పాటు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెళ్లను ఆహ్వానించలేదని జ్యోతిలో వార్త ప్రచురించారు.
ఇలా టీడీపీ, వైసీపీ మధ్య మీడియా పరంగా కూడా విభజన రేఖ వచ్చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ టీడీపీ అనుకూల మీడియా..ముఖ్యంగా ఆంధ్రజ్యోతితో అనుకూలంగా ఉంటోన్న వైసీపీ వాళ్లకు గట్టి వార్నింగే ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై జగన్ ఓ నేతను పక్కన పెట్టేసినట్టు కూడా విశ్వసనీయవర్గాల ద్వారా మ్యాటర్ లీక్ అయ్యింది.
గతంలో గుంటూరు మిర్చియార్డుగా పనిచేసిన లేళ్ల అప్పిరెడ్డి గతంలో వైఎస్.రాజశేఖర్రెడ్డికి ఆ తర్వాత జగన్కు ముఖ్య అనుచరుల్లో ఒకరు. ఈ క్రమంలోనే జగన్ గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ సీటును అప్పిరెడ్డికి ఇవ్వగా ఆయన ఓడిపోయారు. ఇక ప్రస్తుతం అప్పిరెడ్డిని జగన్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అప్పిరెడ్డి ఆంధ్రజ్యోతి మీడియాకు చెందిన వాళ్లతో చాలా క్లోజ్గా ఉంటారని అంబటి రాంబాబుతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జగన్కు కంప్లైంట్ చేశారట.
అప్పిరెడ్డి ఆంధ్రజ్యోతి మీడియా వాళ్లతో క్లోజ్గా ఉండడంతో పాటు పార్టీకి చెందిన అన్ని అంశాలను జ్యోతి మీడియాకు లీక్ చేస్తున్నాడన్న అంశాన్ని సైతం జిల్లా వైసీపీ నాయకులు జగన్ చెవిలో వేశారట. ఈ క్రమంలోనే నిన్నటి వరకు సామాజికవర్గ పరంగాను, ఇతరత్రా అంశాల్లోను అప్పిరెడ్డికి మంచి ప్రయారిటీ ఇచ్చిన జగన్ ఆయన్ను పక్కన పెట్టేసినట్టే తెలుస్తోంది. ఇక అప్పిరెడ్డి మాత్రమే కాదు…టీడీపీ అనుకూల మీడియాకు పార్టీ వ్యవహారాలు లీక్ చేసేవారిపై జగన్ వేగులు ఓ కన్నేసి ఉంచేపనిలో ఉన్నారట.