భూమా నాగిరెడ్డి మరణంలో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఈ స్థానం నుంచి గెలిచి తీరాలని ఏపీ అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పంతం పట్టాయి. ఈ సీటు తమదేనని వైసీపీ, లేదు తమ అభ్యర్థిగా ఉన్న భూమా మరణించాడు కాబట్టి ఇది తమదేనని టీడీపీలు వాదిస్తున్నాయి. ఇక, అధికార పక్షం ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే తమ అబ్యర్థిగా భూమా కుటుంబానికే చెందిన బ్రహ్మానందరెడ్డిని నిలబెట్టింది. సెంటిమెంట్ సహా అభివృద్ధి పేరుతో కోట్లకు కోట్లు కుమ్మరిస్తోంది.
చంద్రబాబు సైతం సీఎం హోదాలో ఇప్పటికే రెండు సార్టు విస్తృతంగా పర్యటించి ప్రజలకు తమ పార్టీకే ఓటేయాలని పిలుపు కూడా ఇచ్చారు. మంత్రులు సైతం రంగంలోకి దిగారు. ఇక స్థానిక ఎమ్మెల్యేలే కాకుండా మంచి వాక్చాతుర్యం ఉన్న ఎమ్మెల్యేలను బాబు ఏరికోరి నంద్యాలకు పంపుతున్నారు. అక్కడ టీడీపీ తరపున ప్రచారం చేసి ఎలాగైనా గెలిపించేలా పక్కాప్లాన్తో ముందుకు పోతున్నారు. మరి అధికార పక్షం ఇంత చేస్తుంటే విపక్షం ఊరుకుంటుందా? తాను రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకునే ప్రయత్నంలోనే ఉంది వైసీప
వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులతో పాటు వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 15 మంది ఎమ్మెల్యేలను నంద్యాలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. ఇప్పటికే వీరు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరితో పాటు నంద్యాలలోని 42 వార్డులకు సంబంధించి ఒక్కొక్క వార్డుకు ఇద్దరేసి చొప్పున ఇన్ ఛార్జులను నియమించారు. అధికార టీడీపీ నేతలు నంద్యాల ఓటర్లను మభ్యపెట్టకుండా ఏక్షణానికి ఆ క్షణం కాపలా కాసేలా.. వైసీపీ అధినేత జగన్ షాడో టీమ్స్ ను ఏర్పాటు చేశారు. మెరికల్లాంటి కార్యకర్తలను రాత్రివేళ గస్తీ తిప్పుతున్నట్టు సమాచారం.
అలాగే త్వరలోనే జగన్ రోడ్ షోతో పాటు భారీ బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆయన రాకతో వైసీపీ అభ్యర్థి బలం మరింత పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు. అలాగే జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సోదరి, జగనన్న బాణం.. షర్మిల కూడా నంద్యాలలోప్రచారం చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని సమాచారం. సో.. ఇలా జగన్ నంద్యాలలో గెలుపుపై మంచి వ్యూహంతోనే ఉన్నట్టు సమాచారం. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. చంద్రబాబు మొన్నామధ్య నిర్వహించిన రోడ్ షోకు జనాల్ని తరలించాల్సి వచ్చిందట. అయితే, ఇప్పుడు మాత్రం జగన్ కోసం జనం ఎదరు చూస్తున్నారని స్థానికులు అంటున్నారు.