జగన్ పార్టీ వైసీపీలో తనకు ఎదురు లేదని భావించిన ఆ పార్టీ లేడీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజాకు ఇప్పుడు కష్టాలు స్టార్టయ్యాయని అంటున్నారు. అది కూడా ఆ పార్టీ అధినేత జగన్ నుంచేనని సమాచారం. తన జబర్దస్త్ దూకుడుతో మీడియాలో ఏదో ఒక కామెంట్ చేసి.. అధికార పార్టీని ఇరుకున పెట్టే.. రోజా.. సడెన్గా ఇలా పార్టీ అధినేతకు దొరికిపోవడం ఏంటి? జగన్తో క్లాస్ చెప్పించుకునే స్థాయికి ఎందుకు దిగజారింది? అసలేం జరిగింది? అంటే..
స్టార్టింగ్లో టీడీపీ మహిళా నేతగా ఉన్న రోజా తర్వాత వైసీపీలో చేరింది. అక్కడి నుంచి నగరి నియోజకవర్గం సీటు సంపాయించి.. గెలిచి ఎమ్మెల్యే కూడా అయింది. అంత వరకు బాగానే ఉన్నా.. అసెంబ్లీలో టీడీపీపై దూకుడు భారీ ఎత్తున పెంచి అధినేత దృష్టిలో పడాలని విశ్వప్రయత్నాలు చేసింది. అయితే, అది కాస్తా వికటించి.. దూకుడు ఆమె మెడకే చుట్టుకుని ఏడాదిపాటు సస్పెండ్ అయింది. అయినా ఆమె తీరులో మార్పురాలేదు.
ఇటీవల కాలంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మరింతగా రెచ్చిపోతోంది. అయితే, గత కొన్నాళ్లుగా జగన్ పార్టీ సహా తన పంథా మార్చుకున్నాడు. ప్రభుత్వంపై విమర్శలు కేవలం 25% మాత్రమేనని.. ఎవరి వారు తమ నియోజకవర్గాల్లో తిరిగి ప్రజల మన్ననలు పొందాలని పిలుపునిచ్చాడు. దీనికి అందరూ సరే అని వెళ్లిపోయారు. అయితే, రోజా మాత్రం ఇప్పటి వరకు నగరిలో పర్యటించింది లేదు. వీలైతే.. తిరుపతి వెళ్లినప్పుడు శ్రీవారి దర్శనం తప్ప.. నియోజకవర్గంలో ప్రజలకు తన దర్శనం మాత్రం ఇవ్వడం లేదని, ఎంతసేపూ ప్రభుత్వంపై విమర్శలతోనే కాలం వెళ్లదీస్తోందని జగన్కు రిపోర్టులు అందాయి.
దీంతో సీరియస్ అయిన జగన్ మరో రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లాల్సిన సమయంలో ఇలా ఇంకా విమర్శలతోనే కాలం వెళ్లదీయం ఏమిటని, నా మాట వింటావా? వినవా? అని రోజాను నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన రోజాకు లక్ష్యాలతో పాటు బాధ్యతలను కూడా ఒకింత సీరియస్గానే వివరించినట్టు తెలిసింది.
తన మాట వినకపోతే.. కఠిన నిర్ణయాలకు సైతం వెనుకాడబోనని జగన్ హెచ్చరించినట్టు కూడా తెలిసింది. మొత్తానికి ఇప్పుడు రోజా తన పొలిటికల్ జబర్దస్త్ స్కిట్ని కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఏం జరుగుతుందో చూడాలి.