తూర్పుగోదావరి జిల్లాలో బలపడాలని భావిస్తున్న వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గంలో నాయకత్వ సమస్యలు పార్టీని వెంటాడుతున్నాయి. కీలక నేత పిల్లి సుభాష్చంద్రబోస్ నాయకత్వంపై శ్రేణులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక, సొంత సామాజికవర్గం గల వార్డుల్లో ఓటమి చెందడం.. ఇవన్నీ ఆయన నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక వైసీపీలో పిల్లి బోస్ పని అయిపోయిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ సుభాష్చంద్రబోస్ శల్యసారథ్యంలో స్వంత నియోజకవర్గం రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా బలహీనపడుతోంది. రామచంద్రపురం పురపాలక సంఘం ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం! మున్సిపాలిటీలో 17,21,23 వార్డులకు ఏప్రిల్ 9న ఉపఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెల్లడయ్యే సరికి వైకాపా కార్యకర్తలు కంగుతిన్నారు. బోసు స్వంత సామాజికవర్గానికి చెందిన అత్యధిక ఓట్లు ఉన్న 25వ వార్డుతో పాటు మొత్తం 3వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు ఓడిపోవడంతో శ్రేణులు తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాయి. దీనిని చాలా అవమానకరంగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
స్థానిక నాయకత్వం ప్రజల్లో పట్టుకోల్పోవడం వలనే ఇలా జరిగిందని పలువురు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మూడు స్థానాలకు గాను రెండు స్థానాలు లభిస్తాయని వైసీపీ నేతలు ఊహించారు. అయితే బోసు నాయకత్వ లోపంతో మూడు స్థానాలనూ వదులుకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. బోసు నిర్లక్ష్య వైఖరి కారణంగానే స్వంత సామాజికవర్గం (శెట్టిబలిజ) ఉన్న 25వ వార్డులో తెలుగుదేశానికి 700 ఓట్లు లభించగా, వైఎస్ఆర్ కాంగ్రెస్కు కేవలం 148 ఓట్లు దక్కడం చర్చనీయాంశమయ్యింది. గెలవాల్సిన చోట కూడా ఇంత దారుణంగా ఓడిపోతే భవిష్యత్లో నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చని పార్టీ ముఖ్య నాయకుడు వ్యాఖ్యానించారు.
రామచంద్రపురంలోని కె గంగవరం, కాజులూరు వైసీపీ కన్వీనర్లు ప్రజల్లోకి రావడం లేదన్న విమర్శలున్నాయి. ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా పార్టీకి దూరమవుతుండటం పట్ల కార్యకర్తలు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోసు వ్యవహరించిన తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి తగిన సంఖ్యా బలం లేనప్పటికీ.. ఎమ్మెల్సీగా స్థానిక ఎంపీటీసీని బరిలోకి దించడం, తర్వాత టీడీపీ నుంచి భారీగా సొమ్ము తీసుకున్నట్టు బయటకు పొక్కడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.