తాను ఇంటర్నేషనల్ ఫిగర్నని, బిల్గేట్స్కి ఇండియా దారి చూపించింది తానేనని, మైక్రోసాఫ్ట్కి హైదరాబాద్ ఎక్కడుందో చెప్పింది తానేనని పదేపదే చెప్పుకొచ్చే ఏపీ సీఎం చంద్రబాబుకి.. జగన్ పార్టీ వైసీపీ మైండ్ తిరిగిపోయే షాక్ ఇస్తోంది! ఇటు రాష్ట్రం, దేశంలో బాబు పరువును పదేపదే బజారున పడేస్తున్న వైసీపీ ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్గా కూడా బాబును ఏకేస్తోంది. దీనికి రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను వాడుకుంటోంది.
సోషల్ మీడియాలో సీఎం తనయుడు లోకేష్కి, శాసన మండలికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ జరిగిన అరెస్టులను అంతర్జాతీయంగా కూడా వైసీపీ ఏకేస్తోంది. భావప్రకటనా స్వేచ్ఛకు బాబు ఇదేనా విలువ ఇచ్చేది.. నిరంకుశ ప్రభుత్వం అంటూ.. పెద్ద ఎత్తున ఉద్యమాలకు తెరదీసింది. ఇప్పటికే.. సోషల్ మీడియాలో బాబుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లతో కుమ్యేయాలంటూ.. పిలుపు నిచ్చిన వైసీపీ.. ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా ఇదే పిలుపు నివ్వడం గమనార్హం.
వైసీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవరెడ్డి ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేలో జరిగిన భేటీలో ఏపీలో సోషల్ మీడియాపై ప్రస్తుత పరిస్థితులను చర్చించారు. తక్షణమే ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ ను, బెంగళూరులో అరెస్ట్ చేసిన రవీంద్రను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారం అనేది శాశ్వతం కాదని, వినాశకాలే విపరీత బుధ్ది అని హితవు పలికారు.
సోషల్ మీడియా మీద మీ అరాచకాలు ఇకనైనా ఆపేయాలని సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న రవికిరణ్ను, రవీంద్రను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సో.. మొత్తానికి బాబు పరువు అమెరికా సైట్లలోనూ పోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. బాబుగారు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.