ఏపీ అధికార పార్టీ టీడీపీ ఎమ్మెల్యేల్లో ఓ పది పదిహేను మంది బ్లాక్ షీప్స్గా మారారా? లెక్కలేనన్ని దందాలతో కోట్లు గడించారా? ఆ డబ్బును ఇప్పడు ప్రధాని మోడీ సంచలన నిర్ణయంతో ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నారా? బ్లాక్ మనీకి కేరాఫ్గా మారిన ఆ తెలుగు తమ్ముళ్లు. ఇప్పడు నించోలేక, కూర్చోలేక, ఆఖరికి నిద్ర కూడా పట్టక తెగ టెన్షన్ ఫీలవుతున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది! ముఖ్యంగా ఉభయ గోదావరి సహా కోస్తా జిల్లాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు సంచుల కొద్దీ సొమ్మును ఎక్కడ దాచాలో తెలీయ తెగ చించుకుంటున్నారట.
2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది కోట్లకు పడగలెత్తారనేది కాదనలేని వస్తవం. దీనిని మొదట్లో చంద్రబాబు తీవ్రంగానే వ్యతిరేకించారు. అయితే, 2019లో మీరు మళ్లీ అధికారంలోకి రావాలంటారు. మరో పక్క జగన్ సహా విపక్షాలన్నీ ఓట్ల కోసం డబ్బులు ధారపోస్తున్నాయి. దీనికి తగ్గట్టు మీరు పార్టీ ఫండ్ ఇచ్చేది లేదు. అధికారంలోకి రావాలంటే ఓట్లు పడాలంటే.. ఓట్లు పడాలంటే.. నోట్లు జల్లాలి. కాబట్టి ఏం చేయాలో మీరే చెప్పండి? అని అంతర్గత సమావేశాల్లో టీడీపీ తమ్ముళ్లు.. అధినేతకు పరీక్ష పెట్టారు. దీంతో అటు సంపాయించుకోమని చెప్పలేక, ఇటు వద్దని అనలేక చంద్రబాబు తెగ ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి.
ఇదే అదునుగా తెలుగు తమ్ముళ్లు విజృంభించారు. ముఖ్యంగా గనులు, ఇసుక తదితర వ్యాపారాలకు పుట్టినిల్లయిన కోస్తాలో కుమ్మేశారు. ప్రతి పనికీ ఇంతని రేటు కట్టి.. వసూలు రాజాలుగా మారారు. పోలవరం ఎమ్మెల్యే ఏకంగా కౌంటర్ పెట్టి.. డబ్బులు లెక్కించే మిషన్లు పెట్టి మరీ దందా సాగించాడు. ఈ క్రమంలో వీరంతా ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. దాదాపు 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సంచుల నిండా పేర్చినా.. కట్టలు ఇంకా మిగిలిపోతున్నాయట. దీంతో వీటని ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుండి శని పట్టడం అంటే ఇదేనని నలిగిపోతున్నారు.
ఇంత డబ్బుని వేరే ఎవరికైనా ఇచ్చి బ్యాంకుల్లో వేసుకోమంటే తిరిగి ఇస్తారో ఇవ్వరో అనే భయం. అలాగని బ్యాంకుల్లో మార్చుకుందామంటే.. ఐటీ కొరడా .. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక రాత్రుళ్లు కూడా రోడ్లమీదే తిరుగుతున్నారట. మరి ఈ బ్లాక్ షీప్స్కి ఎప్పుడు నిద్ర పడుతుందో నని మిగిలిన వాళ్లు అంటున్నారు. ఇక, ఈ విషయం తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ఎవరు చేసుకున్న ఖర్మ వాళ్లు అనుభవించాల్సిందేనని అనుచరులతో అంటున్నారట!! మొత్తానికి టీడీపీ బ్లాక్ షీప్స్.. ఎప్పటికి నిద్రపోయేనో?!