అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌కు రిసార్ట్స్‌లో చిత్ర‌హింస‌లు

త‌మిళ‌నాడులో కొద్ది రోజులుగా హై స‌స్పెన్ష్ టెన్ష‌న్ క్రియేట్ చేసిన రాజ‌కీయ డ్రామాకు ఈ రోజుతో చాలా వ‌ర‌కు క్లారిటీ వ‌చ్చేసింది. సీఎం అయ్యేందుకు అన్ని ర‌కాల ప్లాన్లు వేసిన వీకే శ‌శిక‌ళ ప్లాన్లు అన్ని బెడిసికొట్టాయి. ఆమెకు నాలుగు సంవ‌త్స‌రాలు జైలు శిక్ష ప‌డ‌డంతో ఆమె ముఖ్య‌మంత్రి అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసే వీలు కూడా లేదు. ఇదిలా ఉంటే ఎలాగైనా సీఎం అవ్వాల‌ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేల‌తో రిసార్ట్స్‌లో సీక్రెట్ శిబిరం నిర్వ‌హించిన శ‌శిక‌ళ ఆ శిబిరంలో ఎమ్మెల్యేల‌కు చుక్క‌లు చూపించి…వారిని చిత్ర హింస‌ల‌కు గురిచేశార‌ట‌.

గోల్డెన్ బే రిసార్ట్స్‌లో శశికళ అనుచరులు తమను చిత్రహింసలకు గురిచేశారని శశికళ శిబిరం నుంచి బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. శ‌శిక‌ళ శిబిరంలో త‌మ‌ను ర‌క‌ర‌కాల ఇబ్బందుల‌కు గురి చేసిన‌ట్టు మథురై (సౌత్) ఎమ్మెల్యే ఎస్ఎస్ శరవణన్ ఆరోపించారు. ముఖ్య‌మంత్రిగా ప‌న్నీర్ సెల్వంకే మ‌ద్ద‌తు తెలిపిన ఆయ‌న గోడ‌దూకి పారిపోయి వ‌చ్చి మ‌రీ ప‌న్నీరు చెంత చేరారు.

వారం రోజులుగా శశికళ శిబిరంలో ఉన్న ఆయన.. సోమవారం రాత్రి గోడ దూకి మరీ బయట పడ్డారు. అక్కడి నుంచి మారు వేషంలో సెల్వం శిబిరానికి వచ్చి జైకొట్టారు. శిబిరం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన శ‌ర‌వ‌ణ‌న్ అక్క‌డ ఎమ్మెల్యేల‌ను చిత్ర‌హింస‌లు పెడుతూ…న‌ర‌కం చూపిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేల‌కు బ‌య‌ట ప్ర‌పంచంతో సంబంధం లేకుండా ఒంట‌రిగా ఉంచ‌డంతో పాటు త‌మ‌ను మానసిక‌, శారీరక వేధింపులకు గురి చేసిన‌ట్టు ఆయ‌న ఆరోపించారు. అయితే తాము మాత్రం ఫోన్ల‌తో పాటు సోషల్ మీడియాను వేదిక‌గా చేసుకుని ప‌న్నీర్‌కు త‌మ మ‌ద్ద‌తు తెలిపామ‌ని ఆయ‌న చెప్పారు. ఇక త‌మ‌ను ప్ర‌త్యేక బ‌స్సుల్లో చెన్నై ఎయిర్‌పోర్టుకు …అక్క‌డి నుంచి ఢిల్లీలో ఉన్న గ‌వ‌ర్న‌ర్ ముందు ప్ర‌వేశ‌పెట్టేందుకు పెద్ద ప్లాన్ వేశార‌ని..అయితే గ‌వ‌ర్న‌ర్ చెన్నైకి వ‌స్తున్నార‌ని తేల‌డంతో ఆ ప్లాన్ విర‌మించుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.