బాహుబలి-2 ఫీవర్ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇప్పటికే మొదటి భాగం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో.. రెండో భాగంపై ఈ అంచనాలు తారస్థాయికి చేరాయి. రెండేళ్లుగా యావత్ దేశాన్ని కుదిపేస్తున్న `బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?` అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునేందుకు సమయం ఆసన్నమవుతోంది. అన్ని వర్గాల్లోనూ ఈ ఆసక్తి పెరుగుతోంది. రాజకీయ నాయకులను కూడా ఈ ప్రశ్న వదిలిపెట్టడం లేదు. దీంతో తొలిరోజే ఈ సినిమా చూసేయాలనే ఆతృత అందిరిలోనూ పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టే తమతమ దగ్గరి పరిచయాలను తెరపైకి తెస్తున్నారు. కొందరు మంత్రులు కూడా తమ రాజకీయ బలంతో తమ వారికి టికెట్లను బ్లాక్ చేయిస్తున్నారట.
బాహుబలి-2. సినిమా విడుదలకు ఇంకా తొమ్మిది రోజుల టైమ్ ఉంది. కానీ అప్పుడే ఈ సినిమా టిక్కెట్ల యుద్ధం ప్రారంభం అయింది. పైకి అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కన్పిస్తున్నా.. ఎక్కడికి అక్కడ ఈ సినిమా టిక్కెట్లు దక్కించుకునే ప్రయత్నాల్లో అభిమానులు ఉన్నారట. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి వారి బాహుబలి 2 టిక్కెట్లు తమ స్నేహితులు.. బంధువులు, కుటుంబ సభ్యుల కోసం బ్లాక్ చేసుకునేందుకు తమ పరపతిని ఉపయోగిస్తున్నారట. దీనికి తోడు వేసవి సెలవులు. ఇక ఒకటే సందడి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ ల్లో టిక్కెట్ల కోసం భారీ ఎత్తున పైరవీలు సాగుతున్నాయట.
మంత్రుల పేషీల దగ్గర నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకూ ఎవరు అందుబాటులో ఉంటే.. వారితో టిక్కెట్లు బ్లాక్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. చాలా మంది సినిమా విడుదల అయ్యే ఏప్రిల్ 28న తొలి షో చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా ఐమ్యాక్స్ లోనే తమ సన్నిహితులు.. మిత్రుల కోసం వందల సంఖ్యలో టిక్కెట్లు బుక్ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో మిగిలిన టాప్ హీరోల సినిమాల తరహాలో ఆన్ లైన్ సామాన్య ప్రేక్షకులకు ఆ రోజు టిక్కెట్లు దొరకటం మాత్రం కష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఐమ్యాక్స్ తో పాటు నగరంలో మల్లీప్లెక్స్ ల్లో మాత్రం బాహుబలి 2 టిక్కెట్ల కు డిమాండ్ పీక్ లో ఉంది.
టాప్ హీరోల సినిమాలకే హైదరాబాద్ లో సందడి సందడి ఉంటుంది. అలాంటి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి 2 అంటే సహజంగా హైప్ అందనంత రీతిలో ఉండటం సహజం. బాహుబలి తొలి భాగంలో కూడా సినిమాలో యుద్ధాల సీన్లు.. జలపాతాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఇందులో అంతకు మించి ఉంటాయని జక్కన్న చెప్పడంతో.. ఈ సినిమా ఇంకెంత విజువల్ వండర్గా ఉంటుందో ననే ఉత్కంఠ పెరిగిపోయింది.