టీడీపీలో సీఎం చంద్రబాబు తర్వాత ఎవరు? అంటే వెంటనే సందేహం లేకుండా వినిపించే పేరు నారా లోకేష్! అలాగే టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ తర్వాత సెకండ్ స్థానంలో ఉన్నదెవరంటే.. కేటీఆర్ పేరు వినిపిస్తుంది. మరి వైసీపీలో జగన్ తర్వాత ఎవరు? అంటే మాత్రం సందిగ్ధం తప్పదు!! ఈ ప్రశ్నకు ఇప్పుడు ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరి మధ్యే పార్టీలో తీవ్ర పోటీ జరగుతుందనడంలో సందేహమే ఉండదు. వారిలో ఒకరు జగన్ వదిలిన బాణాన్ని అని పాదయాత్ర చేసి ప్రజల్లో పార్టీని నిలబెట్టిన షర్మిళ, మరొకరు సాక్షి సంస్థలను నడిపిస్తున్న జగన్ భార్య భారతి!! పార్టీలో రెండో స్థానం కోసం వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ ఫైటింగ్ తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది.
త్వరలోనే విజయవాడలో ప్రతిపక్ష వైసీపీ ప్లీనరీ ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే జగన్పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జి షీట్లు, ఈడీ దాఖలు చేసిన 5 చార్జి షీట్లలో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి వైసీపీ నేతల్లో నెలకొంది. ఇదే సమయంలో ఒకవేళ ఎన్నికల సమయానికి జగన్ అరెస్టయితే.. పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తారనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. గతంలో జగన్ జైల్లో ఉన్న సమయంలో ఆయన సోదరి షర్మిళ.. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి.. ప్రజల్లోకి పార్టీని కొంత వరకూ తీసుకెళ్లగలిగారు. పార్టీకి అండగా నిలిచారు. జగన్ జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె.. పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు.
ఇదే సమయంలో జగన్ భార్య భారతి పేరు కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. జగన్కు చెందిన మీడియా వ్యవహారాలను చూసుకుంటున్న ఆమె కూడా రాజకీయాల్లోకి రావొచ్చని చర్చ జరుగుతోంది. జగన్ అరెస్టయితే ఆమె పార్టీ పగ్గాలు తీసుకుంటారని కూడా కొందరు భావిస్తున్నారు. జగన్ అవినీతి కేసులనుంచి బయట పడడం కష్టమని అందుకే పార్టీలో నంబర్ 2 కోసం వెతుకుతున్నారని టీడీపీ నేతలు ఆయన కూడా విమర్శిస్తున్నారు. కాగా వైసిపి లో జగన్ తరువాతి స్థానం అతని సోదరి షర్మిల లేదా తల్లి విజయమ్మదే అనే అభిప్రాయం వైసీపీ లో ఉంది.
జగన్ కుటుంబం నుంచి కాకుండా వేర వ్యక్తులు నంబర్ 2 గా ఎదగలేరనేది మరి కొందరి వాదన. గతంలో జగన్ జైలు పాలైన నేపథ్యంలో షర్మిల ముందుండి పార్టీని నడిపించారు.కాగా షర్మిల కాకుండా జగన్ తరువాత అంత సమర్థవంతగా పార్టీ ని నడిపించే వ్యక్తులు ఎవరున్నారనే చర్చ జరుగుతోంది. మరి షర్మిలనా.. భారతినా అనే విషయంపై త్వరలోనే ఒక క్లారిటీ రావొచ్చేమో వేచిచూద్దాం!!