సినీనటులకు రాజకీయాలపై నానాటికీ ఆసక్తి అధికమవుతోంది. ముఖ్యంగా సినీ తెరపై గ్లామర్ ఒలకబోసి.. టాప్ స్థానంలో ఉన్న హీరోయిన్లంతా ఇప్పుడు రాజకీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. 90వ దశకంలో ఒక వెలుగు వెలిగిన నగ్మా. ఖుష్బూ వంటి వాళ్లంతా రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటే.. వారిని చూసి `శివగామి`కి కూడా రాజకీయాలంటే ముచ్చట కలిగినట్టుంది. అందుకే రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు నటి రమ్యకృష్ణ! ఏ పార్టీలో చేరతారనేది ఇంకా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఆమె కాషాయ జెండా కప్పుకోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
బాహుబలిలో శివగామీదేవిగా మెప్పించిన రమ్యకృష్ణ.. రాజకీయాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు. బాహుబలి విజయం తర్వాత.. వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న శివగామి.. ఓ ముఖాముఖిలో.. రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఏది జరగాలని రాసి పెట్టి ఉంటే.. అది జరుగుతుందన్నారు. తన వల్ల ప్రజలకు మంచి జరగాలని రాసి పెట్టి ఉంటే.. అదే జరగవచ్చని అంచనా వేసినట్టు మాట్లాడారు. రమ్యకృష్ణ ఉత్సాహం చూస్తుంటే.. ఆమె రాజకీయాల్లోకి రావడం తథ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే.. వెనకటి తరం హీరోయిన్లు ఖష్బూ, నగ్మా లాంటి వాళ్లు.. రాజకీయాల్లో బిజీగా గడుపుతున్నారు. అలాంటిది.. రమ్యకృష్ణ ఆ పని చేస్తే తప్పేంటన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే.. రాజకీయాలపై ఆసక్తికర కామెంట్లు చేసిందే తప్ప.. ప్రాంతీయ లేదా జాతీయ పార్టీల్లో ఏ పార్టీ వైపు అడుగులు వేసేదీ మాత్రం శివగామి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తున్న తరుణంలో.. ఆమె ఆ పార్టీ వైపు అడుగులేయవచ్చని తెలుస్తోంది.