`భాషా` కోసం హీరోయినే రంగంలోకి దిగిందా?

త‌మిళ‌నాడు మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత ఏర్ప‌డిన రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు బీజేపీ తెగ ప్ర‌య‌త్నాలు చేసింది. ఇదే స‌మ‌యంలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పేరు కూడా బ‌లంగా వినిపించింది. ఎలాగైనా ఆయన్ను త‌మ వైపు తిప్పుకోవ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నాలు చేసింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోకి దిగిందా అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలిండియా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి.. సినీ నటి నగ్మా తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవటం ఆసక్తికరంగా మారింది. దీంతో మ‌రోసారి త‌మిళ‌నాట హీట్ పెరిగింది.

కొద్ది రోజులుగా త‌మిళ రాజ‌కీయాలు త‌లైవా చుట్టూ తిరుగుతున్నాయి. రాజ‌కీయాల్లోకి వా.. వా.. అని అటు రాజ‌కీయ నాయ‌కులు, ఇటు ఆయ‌న అభిమానుల నుంచి ఒత్తిడి అధిక‌మ‌వుతోంది. జ‌య‌ల‌లిత మ‌రణం త‌ర్వాత ఇది మ‌రింత తీవ్ర‌మైంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న వ‌స్తార‌ని అంతా ఆశ‌గా ఎదురుచూడ‌టం.. వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతుంటారు ర‌జినీ. ఈ సంద‌ర్భంలోనే తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ తో పలువురు ప్రముఖులు తరచూ భేటీ అవుతున్నారు. ఇందులో కొంద‌రు రాజకీయ ప్రముఖులు కూడా ఉండ‌టం చర్చనీయాంశంగా మారే పరిస్థితి.

తనకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేనట్లుగా చెప్పినప్పటికీ.. తన సినిమాల్లో నర్మగర్భమైన డైలాగ్స్ తో తన మనసులోని కోరికను చెప్పుకోవటం కనిపిస్తుంది. ఒకప్పుడు రజనీతో కలిసి సూపర్ హిట్ భాషాలో నటించిన న‌గ్మా.. ఇప్పుడు అక‌స్మాత్తుగా ఆయ‌న్ను క‌ల‌వ‌డం ఫోక‌స్ అంతా ర‌జినీపై ప‌డింది. రాజకీయాల్లో రజనీ ఎంట్రీపై పలు వ్యాఖ్యలు వినిపిస్తున్న వేళ.. తాజా భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంపై ఆసక్తికర చర్చ మొదలైంది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నగ్మా.. ఇది జరిగిన తర్వాతి రోజే రజనీకాంత్ ను కలవటం వెనుక ఏదైనా కారణం ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

వీరి భేటీ ఏ అంశాలకు సంబంధించిందన్న సమాచారం బయటకు రాలేదు. రజనీని కలిసిన సందర్భంగా శాలువా.. పూలబొకేతో ఆయన్ను సత్కరించారు. వీరి భేటీ మర్యాదపూర్వకమైనదే తప్పించి.. ఎలాంటి రాజకీయాంశాలు లేవని చెబుతున్నా.. పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.