2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా కనిపిస్తోంది. పవన్ ఏపీకి చెందిన వాడు కావడంతో పాటు పవన్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జనసేన 2019 ఎన్నికల్లో ఎంత వరకు ఇక్కడ ప్రభావం చూపుతుందన్న అంచనాలు అందరిలోను నెలకొన్నాయి.
పవన్ ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి ఎలాంటి ముందడుగులూ పడటం లేదనే తెలుస్తోంది! వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేస్తాం అని పవన్ చేసిన ప్రకటనే తప్ప ఇప్పటి వరకు ద్వితీయశ్రేణి నాయకత్వం గురించి గాని, పార్టీ క్యాడర్ నిర్మాణం విషయంలో జనసేనకు ఎలాంటి పురోగతీ లేదు.
ఇదిలా ఉంటే పవన్ వరుసగా సినిమాల్లో బిజీ అయ్యాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తోన్న పవన్ ఆ తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇన్ని పనుల మధ్య పవన్ ఇక జనసేనను అధికారంలోకి తీసుకు వస్తాడని ఆశించడం కూడా అత్యాశే అవుతుందేమో. జనసేన వర్గాల ఇంటర్నల్ టాక్ ప్రకారం జనసేన ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా 50 ఎమ్మెల్యే, 10 ఎంపీ సీట్ల మీదే కాన్సంట్రేషన్ చేసేలా వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ సామాజికర్గం బలంగా ఉండే విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుతో పాటు రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన మెయిన్ కాన్సంట్రేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీతో పొత్తు కుదిరినా ఈ జిల్లాల పరిధిలోనే జనసేన ఎక్కువ సీట్లు అడుగుతుందనడంలో డౌటే లేదు. సొంతంగా బరిలోకి దిగి అన్ని స్థానాల్లో పోటీ చేసినా జనసేన మెయిన్ కాన్సంట్రేషన్ మాత్రం ఈ జిల్లాలపైనే ఉంటుందట.