పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజకవర్గంలో కుల ఈక్వేషన్లే ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇక్కడ కులాల లెక్కలే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంటాయి. పశ్చిమ డెల్టాలో కాపులు వర్సెస్ శెట్టిబలిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బలం మెండు. పెనుగొండ నుంచి ఒకసారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు.
2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గత ఎన్నికలకు ముందు కిరణ్కుమార్ రెడ్డి జైసమైక్యాంధ్ర పార్టీలో చేరి ఆ వెంటనే టీడీపీలోకి జంప్ అయ్యి ముచ్చటగా మూడోసారి గెలిచారు. కొద్ది రోజుల క్రితం జరిగిన ప్రక్షాళనలో కేవలం కుల ఈక్వేషన్స్లోనే పితానికి మంత్రి పదవి దక్కింది. ఈ మూడేళ్ల ఎమ్మెల్యే పాలనలోను, మంత్రిగాను పితానికి ఆచంట నియోజకవర్గంలో ప్రస్తుతానికి కాస్త పాజిటివ్ పరిస్థితులే ఉన్నాయి.
ఇక ఎమ్మెల్యేగా పితాని ఈ మూడేళ్లలో చెప్పుకోదగ్గ పనులేవి చేయలేదు. కేవలం ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల అభివృద్ధి మాత్రమే జరిగింది. మంత్రిగా మరి ఈ 20 నెలల్లో ఎలా పనిచేస్తారన్నదే ? ఆయనకు కీలకం కానుంది. ఇక రాజకీయంగా ఆయనకు కులం వరకు బలం కనిపిస్తున్నా, గతంలో ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జ్గా పనిచేసిన గొడవర్తి శ్రీరాములుతో ఉన్న వైరం ప్రస్తుతానికి చల్లారినా వచ్చే ఎన్నికల నాటికి అది ఎలా మారుతుందో ? చెప్పలేం.
వీరిద్దరి విబేధాల వల్ల ఆచంటలో పితానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఇక్కడ పితానికి చాలా అనుకూలాంశాలే ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నుంచి ఇన్చార్జ్గా వీరవాసరం ఎంపీపీ కౌరు శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన కూడా పితాని సామాజికవర్గానికే చెందిన వారు. గత రెండు ఎన్నికల్లోను పితానికి రెడ్డి, రాజుల వర్గానికి చెందిన వారు ప్రత్యర్థులుగా ఉండడంతో పితాని గెలుపు సులువు అయ్యింది.
ప్లస్ పాయింట్స్ (+) :
– సమన్వయంతో వెళ్లడం
– అభివృద్ధి ఓకే, అందుబాటులో ఉండడం
– పితానికి అండగా ఉంటోన్న కులబలం
– ప్రక్షాళనలో మంత్రి అవ్వడం
మైనస్ పాయింట్స్ (-):
– క్యాడర్ వల్ల మంత్రికి ప్రజలకు పెరిగిన గ్యాప్
– తన కులానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారన్న అపవాదు
– పాత టీడీపీ వాళ్లతో పొసగక పోవడం
– వచ్చే ఎన్నికల్లో కాపు లేదా శెట్టి బలిజ ప్రత్యర్థులు అయితే ఓట్లలో చీలిక
తుది తీర్పు:
పితాని అభివృద్ధి పరంగా చూపించుకోవాల్సిన టైం ఆసన్నమైంది. మంత్రి పదవి రావడం ఆయనకు చాలా ప్లస్. ఈ సారి తన సామాజికవర్గానికే చెందిన వ్యక్తి వైసీపీ నుంచి పోటీలో ఉంటే అది పితానికి పెద్ద దెబ్బే అవుతుంది. అయితే
ప్రస్తుత వైసీపీ ఇన్చార్జ్ కౌరు శ్రీనివాసరావు స్థానికేతరుడు కావడం కూడా పితానికి మరో ప్లస్. అలాగే మరో టాక్ కూడా ఇక్కడ వినపడుతోంది.
గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన వంకా రవీంద్రనాథ్ (కాపు) కు ఈ సారి ఎంపీ టిక్కెట్ కాకుండా ఆచంట ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ వంకా పోటీలో ఉంటే కాపులతో పాటు వైసీపీకి అనుకూలంగా ఉండే ఎస్సీ వర్గం ఓటర్లు కలిస్తే అప్పుడు శెట్టి బలిజ ఓటింగ్ కంటే వీళ్లదే పెచ్చు అవుతుంది. అప్పుడు పితాని గెలుపు కోసం చెమటోడ్చక తప్పదు. వంక గత ఎన్నికల్లో ఎంపీగా ఓడినా ఆచంట సెగ్మెంట్లో మాత్రం ఆయనకు 12 వేల మెజార్టీ వచ్చింది.