
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
లాక్డౌన్ తర్వాత ఇటీవలె ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో స్టార్ హీరో నటించబోతున్నాడ. వాస్తవానికి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో ఇప్పటి వరకు విలన్ ఎవరనేది తేలలేదు. మొదట ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతిని విలన్గా ఎంపిక చేయగా.. ఆయన డేట్స్ కుదరక ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ చిత్రంలో విజయ్ స్థానంలో తమిళ స్థార్ హీరో విక్రమ్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విక్రమ్ అయితే, ఈ పాత్రకు మరింత స్టేచర్ కూడా వస్తుందని సుకుమార్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విక్రమ్ గ్రీన్ సిగ్నెల్ ఇస్తే.. సినిమా మరో లెవల్లో ఉండడం ఖాయం.