
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబో సెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సలార్’ అనే టైటిల్ను ఫిక్స్ చేస్తూ చిత్ర యూనిట్ బుధవారం అధికారికంగా వెల్లడించింది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
అయితే ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ చిత్రం చేస్తున్నారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చిత్రం తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రభాస్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించాడు. ఈ క్రమంలోనే అందరూ రాధే శ్యామ్ తర్వాత ఆదిపురుష్ ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ మీదకు వెళ్తాయని భావించారు.
కానీ, ప్రభాస్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం అయితే ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలు తర్వాత ఈ చిత్రం ఉండాలి. కానీ ఈ రెండింటినీ వెనక్కి నెట్టి రాధేశ్యామ్ తర్వాత ‘సలార్’ చేయాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్. అయితే నిజానికి ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చిన్నవేమీ కావు. భారీ బడ్జెట్ చిత్రాలే. మరి అలాంటి చిత్రాలను ప్రభాస్ వెనక్కి నెట్టడంతో.. దర్శకులు టెన్షన్ ఫీల్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.