
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీలో కూడా విడుదల కానుంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. పుష్ప యూనిట్కు కరోనా సెగ తగిలినట్టు ప్రచారం జరుగుతోంది. లాక్డౌన్ తర్వాత ఇటీవలే రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప’ షూటింగ్ ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. ఎంతో ఉత్సాహంగా షూటింగ్ జరుపుతున్న సమయంతో పుష్ప యూనిట్లో కరోనా కలకలం రేపినట్టు తెలుస్తోంది.
చిత్ర బృందంలో దాదాపు పది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు చెబుతున్నారు. పెద్ద సినిమా కావడంతో ప్రతిరోజూ 200 నుండి 300 వరకు క్రూ మెంబర్స్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కరోనా ఎటాక్ చేసిందని అంటున్నారు. అందువల్లే అనుకున్న తేదీకంటే ముందే షెడ్యూల్ ముగించారని అంటున్నారు. అలాగే కరోనా వేవ్ పూర్తిగా తగ్గాక తిరిగి చిత్రీకరణ మొదలుపెడతారని భావిస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే యూనిట్ స్పందించాల్సిందే.