
ఆంధ్రప్రదేశ్లో తొలివిడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ను శనివారం నాడు విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలి విడతకు జనవరి 25(నేడు) నుంచి నామినేషన్ల స్వీకరించనుండగా.. ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక మొదటి విడతలో విశాఖ తర్వాత అనకాపల్లి, ఆ తరువాత నర్సీపట్నం చివరగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతము, ఏజెన్సీ అయిన పాడేరు సబ్ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.
అయితే ఎన్నికలు అంటే ఎక్కడ చూసినా ఓ సందడి వాతావరణం కనిపిస్తుంది. నోటిఫికేషన్ విడుదల దగ్గర నుంచి అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, ప్రచారాలతో నేతలంతా హడావుడి హడావుడిగా కనిపిస్తాయి. అటు అధికార యంత్రాంగం కూడా బిజీ బిజీగా ఉంటారు. కానీ, ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ విశాఖ జిల్లా యంత్రాంగం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరోవైపు శనివారం నిమ్మగడ్డ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా.. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సహా జిల్లా అధికారులంతా దూరంగానే ఉన్నారు. దీని బట్టీ.. నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ నేడు సుప్రీం ఇచ్చే తీర్పు కోసమే అందరూ ఎదురుచూస్తున్నట్టు అర్థం అవుతోంది.