
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎస్. నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకు జోడీగా మరోసారి కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అలాగే మరో కీలక పాత్రలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.
లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడినప్పటికీ.. అన్లాక్ తర్వాత శరవేగంగా కొరటాల ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు. ఇక మెగా అభిమానులు ఈ చిత్ర టీజర్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆచార్య టీమ్ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. చిత్రం టీజర్ ను 29వ తేదీన సాయంత్రం 4.05కు విడుదల చేస్తున్నట్టు తెలిపారు.
ఈ మేరకు ఓ చిన్న వీడియోను కూడా ఆయన విడుదల చేశారు. `గౌరవనీయులైన చిరంజీవి సార్ కు… ధర్మస్థలి డోర్లు జనవరి 29, సాయంత్రం 4.05 గంటలకు తెరచుకోబడతాయి` అంటూ టీజర్ ప్రకటన వీడియోను కొరటాల పోస్ట్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథాంశం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దేవాదాయ శాఖలో జరిగే అవినీతిని ప్రశ్నించేలా ఈ సినిమా ఉండబోతోంది.