
`క్రాక్` వంటి భారీ విజయం తర్వాత మంచి ఫామ్లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా పూర్తి కాకుండానే రవితేజ.. నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంతో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కూడా రవితేజకు జోడీగా ఇద్దరు కొత్త భామలను రంగంలోకి దింపుతున్నారు.
వారిలో ఒకరు తమిళ భామ ఐశ్వర్యా మీనన్ కాగా.. మరొకరు కన్నడ భామ శ్రీలీల. అయితే వీళ్లిద్దరూ రవితేజ వయసులో సగం కంటే తక్కువగా ఉండడం గమనార్హం. కాగా, రవితేజ కెరీర్లో 68వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.