
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా కుదురుకోలేదు. సీనియర్ నేతలు వరుసగా హ్యాండ్ ఇస్తున్నారు. నాయకత్వ లోపం కారణంగా పార్టీ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే,మేడ్చల్ డిసిసి ప్రెసిడెంట్ కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ పదవులతోపాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపారు. వివరాల్లోకి వెళ్తే..
మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్నానని, 2009లో కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇయ్యకున్నా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిపొందానని వివరించుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా,మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చూశానని, గత ఆరేడేళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధకలిగిస్తున్నాయని వాపోయారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై పోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని, రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఎమ్మెల్యేలను నిలుపుకోవడంలో విఫలమైందని ఎత్తిచూపారు. ఇవన్నీ చూసిన ప్రజలు కూడా టిఆర్ఎస్ అక్రమాలను,హామీల అమలు చేయడంలో వైఫల్యాలను కాంగ్రెస్ పోరాడలేదని, అది దుబ్బాక ,జిహెచ్ఎంసి ఎన్నికల్లో స్పష్టమైంది ఉదహరించారు. చివరకు పీసీసీ చీఫ్ రాజీనామా చేసినా కొత్త నాయకుడిని ఎన్నుకోవడంలో ఆలస్యానికి కారణం పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలేనని, అవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలంటే బీజేపీతోనే సాధ్యమని ఓ నిర్ణయానికి వచ్చాను, అందుకే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరబోతున్నానని ప్రకటించారు. టీఆర్ ఎస్పై అసలుసిసలు పోరాటం చేస్తానని వెల్లడించారు.