ట్రాన్స్జెండర్ అయినా సరే ప్రేమించాడు. యువకుడిది ఎంతో గొప్ప మనుసు అని పొంగిపోయింది. మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి చేసుకుంది. అయితే అది మూణ్నాళ్ల ముచ్చటగానే మారింది. పెళ్లయ్యాక ప్రేమికుడి నీచబుద్ధి బయటపడింది. దీంతో విడిపోయి దూరంగా ఉంటుంది. దీంతో నీచుడు మరింత రెచ్చిపోయాడు. ఏకంగా ఎఫ్బీ ద్వారా వేధించడం మొదలు పెట్టారు. తీరా సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి. అధికారులు, బాధితురాలు తెలిపిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరుకు చెందిన కావలి తారక మహేష్ కు ఫేస్ బుక్ ద్వారా ఓ ట్రాన్స్ జెండర్ పరిచయమైంది. ఆ విషయం తెలిసి కూడా వారిద్దరూ చాటింగ్ ద్వారా కొంతకాలం ప్రేమించుకున్నారు. ఆ తరువాత పెళ్లి చేసుకుని ఎల్బీ నగర్ లో కాపురం పెట్టారు.
అంతవరకు బాగానే ఉన్నా అటు తర్వాతనే ఆ ట్రాన్స్జెండర్కు కష్టాలు మొదలయ్యాయి. యువకుడు తన కుటుంబీకుల ఒత్తిడి మేరకు ఆ ట్రాన్స్జెండర్ను వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు ఎల్ బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లాడు. ఇటీవలనే విడుదలైన బయటకు వచ్చాడు. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా భార్యపై మరింత కక్ష పెంచుకున్నాడు. భార్య మరో ఫేస్ బుక్ వినియోగిస్తున్నట్టు గుర్తించి తన స్నేహితుడు ద్వారా ఫేక్ ఫేస్ బుక్ ఐడీని క్రియేట్ చేసుకుని ఆమె వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యకర సందేశాలు, అశ్లీల ఫోటోలు, వీడియోలు పంపుతూ మానసిక వేదనకు గురిచేశాడు. ఆ వేధింపులను తట్టుకోలేక బాధితురాలి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు రంగంలోకి దిగి భర్తే ఇదంతా చేస్తున్నట్లు నిర్థారించారు. నిందితుడు మహేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.