టీకా పంపిణీ విష‌యంలో కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. చిన్నా‌, పెద్దా అనే తేడా లేకుండా ఎంద‌రో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు అన్ని దేశాల్లోనూ టీకా పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది.

మ‌న భార‌త దేశంలోనూ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతోంది. అయితే దేశంలో కరోనా తీవ్రత మహోగ్రరూపం దాలుస్తున్న వేళ కేంద్ర ప్ర‌భుత్వం టీకా పంపిణీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకా అందించాలని తాజాగా నిర్ణయించింది.

మే 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. కాగా, వివిధ వర్గాలతో తాజాగా ప్రధాని మోదీ విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఆ సమావేశాలు ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.