శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన లారీ , కారు అతివేగంతో ఢీ కొట్టుకోవడంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన దినసరి కూలీలని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ప్రమాద సమాచారం అందుకు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు. గాయపడిన వారిని వైద్యశాలకు తరలించారు. పోలీసులు, అత్యవసర వైద్యసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక శంషాబాద్ ప్రమాద ఘటన పై చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో మాట్లాడి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రులకు వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వివరించారు. ఇక మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.