నాకు క‌రోనా.. సారీ చ‌చ్చిపోతున్నాఅంటూ పేరేంట్స్‌కు ఫోన్‌..

ఏడాది కాలంగా మాన‌వాళిని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది. ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. వైర‌స్ బారిన ప‌డినవారి సంగ‌తేమో కానీ, ఎక్క‌డ వ్యాధి సోకుంతుందోన‌ని ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వైర‌స్‌పై, నివార‌ణ చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న లేని వారు వైర‌స్ సోకింద‌నే తెలియ‌గానే భ‌యంతో ప్రాణాల‌ను విడుస్తున్నారు. మ‌రికొంద‌రు ఒత్తిడిని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. క‌రోనా బారిన ప‌డిన ఓ యువ‌కుడు మాన‌సిక వేద‌న‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో విషాదం నింపింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ‌

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన ఓ యువ‌కుడు గుంటూరు జిల్లా కేంద్రంలోని స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్నాడు. ఒంట‌రిగా అక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉండ‌గా క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఇటీవ‌లే మిల్లులోని సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ఆ యువ‌కుడు సైతం ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. అయితే రిజ‌ల్ట్ రాక‌ముందే సొంతూరుకు వెళ్లాడు. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆ కుర్రాడికి ఓ మెసేజ్ వచ్చింది. ‘మీకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరండి. జాగ్రత్తగా ఉండండి‘ అంటూ వ‌చ్చిన సందేశాన్ని చూసి ఆందోళ‌న‌కు గుర‌య్యాడు. తనకు ఏమైనా అవుతుందేమో, తన వల్ల తన తల్లిదండ్రులకు కరోనా సోకుతుందేమోనన్న భయాందోళ‌న‌తో వెంట‌నే ఇంట్టో ఎవ‌రికీ చెప్ప‌కుండా బయటకు వచ్చేశాడు. కొడుకు జాడ లేక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఫోన్ చేయ‌డంతో ’అమ్మా.. నాకు కరోనా వచ్చింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసకుంటున్నా. సారీ అమ్మా.. నాన్నా.‘ అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో కంగారు ప‌డిన త‌ల్లిదండ్రులు వెంట‌నే గాలింపు చేప‌ట్ట‌గా స్థానిక విజయరాయిలోని ఓ ఫ్యాక్టరీ సమీపంలో పురుగుల మందుతాగి అపస్మారక స్థితిలో క‌నిపించాడు. వైద్య‌శాల‌కు త‌ర‌లించేలోగానే మరణించ‌డంతో త‌ల్లిదండ్రులు క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు.