రాష్ట్రంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసారు. తెలంగాణలో మరలా లాక్డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో లాక్డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించాడు సంజీవ్. నిందితుడు సంజీవ్ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా ముందు హాజరు చేసారు.
సంజీవ్ మాదాపూర్లో ఉంటున్నాడని, సీఏ పూర్తి చేసి ఓ కంపెనీలో వర్క్ చేస్తున్నాడని ఆయన తెలిపారు. లాక్డౌన్ పై ఇది వరుకు వచ్చిన జీవోను డౌన్లోడ్ చేసి, తారీఖులు మార్చి పాత జీవోను వాట్సప్ గ్రూప్లో షేర్ చేశాడని ఆయన వెల్లడించారు. అతని ఫ్రెండ్స్ ఇంకా సన్నిహితులు దానిని ఇతర గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసారని ఆయన చెప్పారు. తప్పుడు జీవోలను ప్రచారం చేస్తే చట్టపరమయిన చర్యలు తీసుకుంటామని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.