కరోనా వైరస్ బారి నుంచి సినీ పరిశ్రమను కాపాడుకోవాలని టాలీవుడ్ లోని అగ్రకథానాయకుడు అయిన మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సినీ కార్మికులంతా ముందుకొచ్చి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపు నిచ్చారు. కరోనా క్రైసిస్ ఛారిటీ సీసీసీ ద్వారా సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు ఫ్రీగా వాక్సినేషన్ సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు చిరంజీవి మంగళవారం నాడు ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నలభైఐదేళ్లు దాటిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్ వేయించేందుకు అపోలో ఆసుపత్రి సౌజన్యంతో సీసీసీ ఒక కార్యక్రమం తలపెట్టింది.
వచ్చే గురువారం నుంచి నెల రోజుల పాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. నలభై ఐదేళ్లు దాటిన తెలుగు సినీ కార్మికులు, సినిమా జర్నలిస్టులు తమ అసోసియేషన్స్, యూనియన్స్ ద్వారా వ్యాక్సినేషన్ కొరకు వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి అని చెప్పారు. సినీ కార్మికులతో పాటు వారి జీవిత భాగస్వాములకు కూడా వ్యాక్సినేషన్ను ఉచితంగా అందించబోతున్నాం. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మెడిసిన్స్ పై రాయితీ ఇవ్వనున్నారు అని తెలిపారు.