ఐదు ల‌క్ష‌లు వ‌స్తాయ‌న్నారు.. అత్యాచారం చేశారు..!

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. మ‌రీముఖ్యంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా మారిపోయింది. మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. సొంత ఇంట్లోనే స్త్రీకి రక్షణ లేకుండా పోతోంది. పనిచేసే ఆఫీసుల్లో, చదువుకునే కాలేజీల్లో, స్కూళ్లల్లో కూడా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. తాజాగా మ‌రో సంఘ‌ట‌న వెలుగుచూసింది. ప్రధానమంత్రి మోదీ రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.5 లక్షలు ఇప్పిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికి ఓ వితంతువుపై ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తతంగాన్నంతా వీడియో తీసి వేధింపుల‌కు గురిచేస్తుండ‌గా, వాటిని తాళ‌లేక పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో జ‌రిగిన దారుణం వెలుగుచూసింది. అధికారులు, బాధితురాలు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం శమాబల్ జిల్లా అస్మోలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నఖాశా గ్రామానికి చెందిన‌ ఓ మహిళ భ‌ర్త కొద్ది కాలం క్రితం మరణించాడు. దీంతో వితంతు పెన్షన్ కోసం స్థానిక ప్రభుత్వ కార్యాలయంలో ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు వెళ్లింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ఓ యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిలీఫ్ ఫండ్ కు వితంతువులు దరఖాస్తు చేసుకుంటే అయిదు లక్షల రూపాయలు ఇస్తార‌ని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడిని కూడా ఆమెకు పరిచయం చేశాడు. అయిదు లక్షలను వచ్చేలా చేసేందుకు గానూ 2వేలు లంచ‌మివ్వాలని మాట్లాడుకున్నారు. పేపర్ వర్క్ పేరుతో ఆ మొత్తాన్ని తీసుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇక లాస్ట్ మీటింగ్ అంటూ ఇటీవ‌ల ఆమెను త‌మ‌ బైక్ పై ఎక్కించుకుని ఊరి చివర ఉన్న మామిడి తోటలోకి తీసుకెళ్లారు. అక్క‌డ ఒకరి తర్వాత మరొకరు పశువుల్లా తమ కామ వాంఛను తీర్చుకున్నారు. ఈ తతంగాన్ని వీడియో కూడా తీశారు. ఎవరికైనా చెబితే వీడియోను బయటపెడతామని బెదిరిస్తూ కొద్ది నెలలుగా ఆమెపై అత్యాచారం చేస్తూనే ఉన్నారు. వారి ఆగడాలను భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా, అధికారులు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.