నాగార్జునసాగర్లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలిగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించింది. దీంతో బుధవారం నాడు సీఎం కేసీఆర్ సభ మామూలుగానే అనుకున్నట్లు కొనసాగనుంది. సభను రద్దు చేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించగా, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలుపాటించకుండా, తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్లో తెలిపారు.కానీ విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే, హాలియా మండలంలోని అనుమల గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్నికల సభను ఆపివేయాలంటూ కోరుతూ దాఖలైన రెండు వ్యాజ్యాల్లోనూ హైకోర్టు నిరాకరించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్వహణ నిబంధనలు ఎస్ఓపీ తూ.చ. తప్పకుండా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీహెచ్ సైదయ్య కూడా సోమవారం లంచ్ మోషన్లో హైకోర్టును ఆశ్రయించారు.