తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిన్న పూర్తి అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించిన ఆయన..కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
ఈ క్రమంలోనే తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి వచ్చి మైలాపురంలో ఓటు వేసిన కమల్.. ఆపై తాను పోటీ చేస్తున్న సెగ్మెంట్ లో ఓటింగ్ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విమానంలో కోయంబత్తూరుకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడిన కమల్..తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నోట్లు, టోకెన్లు జోరుగానే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఓటర్లకు డబ్బులు ఎవరు పంచారన్న విషయమై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, వీటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్లి, రీపోలింగ్ కు డిమాండ్ చేయనున్నానని కమల్ తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో ఈసీ విఫలం అయిందని అన్న కమల్.. ఖచ్చితిగా రీపోలింగ్ పెట్టాల్సిందే అని ఆయన తెలిపారు.