తమిళనాడులో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతా హడావుడి నెలకొంది. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ జరగనుండగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. కోయంబత్తూరు నియోజకవర్గంలో తరచూ ఆయన పర్యటిస్తున్నారు. మంగళవారం భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే ఈ సమయంలో కమల్ కోపంతో ఏకంగా సొంత పార్టీ గుర్తు అయిన టార్చ్ లైట్నే విసిరికొట్టారు. ర్యాలీలో భాగంగా.. ప్రచారం రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు కమల్.
ఒకచోట ప్రజలు పెద్ద ఎత్తున గుమి గూడడంతో వారిని ఉద్దేశించి మాట్లాడాలనుకున్నారు. కానీ కమల్ చేతిలో ఉన్న మైక్రో ఫోన్ పని చేయలేదు. తాను మాట్లాడినా ఆ మాటలు ప్రజలకు వినిపించలేదు. ఏమైందో చూడాలని.. ప్రచార రథంలో ఉన్న కార్యకర్తకు సూచించారు. కానీ ఎంతకూ మైక్రో ఫోన్ పని చేయకపోవడంతో.. ఆగ్రహంతో కమల్ చేతిలో ఉన్న టార్చ్ లైట్ను.. ప్రచారం రథంలో ఉన్న కార్యకర్తపైకి విసిరికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
https://twitter.com/PramodMadhav6/status/1377195965262692353?s=20