ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి కృతీశెట్టి బంపరాఫర్ను కొట్టేసింది. యువహీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించినస్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్ ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. అందులో అంధుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా టాలివుడ్లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రొమాంటిక్ లవ్స్టోరీగా తెరకెక్కనున్న ఆ సినిమాలో ఫిదా భామ సాయిపల్లవిని తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందని సమాచారం.
ఇక అసలు విషయానికి వస్తే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం తిరిగి విజయాల బాట పట్టారు. ఇడియట్, పోకిరి తదితర సినిమాలతో అగ్ర దర్శకుడిగా పేరును సంపాదించుకున్నారు. అటు తరువాత ఆయన తీసిన సినిమాలు వరుసగా ప్లాఫ్లను ఎదుర్కొన్నాయి. ఇటీవలే మరో యువ హిరో రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్బస్టర్ హిట్ అందుకుని తిరిగి విజయాల బాట పట్టారు. పూరీ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక నితిన్ సినిమా పట్టాలెక్కించే అవకాశం ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. గతంలో వారిద్దరి కలయికలో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ పర్వాలేదనిపించింది. ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుండడం హాట్టాపిక్గా మారింది. అయితే అందులో ‘ఉప్పెన’ బ్యూటీ కృతీశెట్టిని హీరోయిన్గా తీసుకోనున్నట్లు సమాచారం.