పాత బ్రిడ్జి కూలి ఒక వ్యక్తి మృతి..!

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని వాంకిడిలో పాత వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాంకిడిలో ఉన్న పాత బ్రిడ్జిని అక్కడ కార్మికులు నిన్న సగం కూల్చి వేశారు. కాగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేబుల్‌ పనుల కోసం ఇద్దరు సిబ్బంది వంతెన పై పని చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకు పోయారు. దీంతో ఒకరు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయ పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని హాస్పిటల్ కి తరలించారు. చనిపోయిన వ్యక్తి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ వాసిగా వారు గుర్తించారు. ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.