వాటితో మాకు సంబంధం లేదు.. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) నుంచి మాట్లాడుతున్నామని మిమ్మల్ని ఎవరైనా సంప్రదించారా..? లేక ఫోన్‌లు చేస్తున్నారా..? ఎస్‌బీఐలో పర్సనల్‌ లోన్‌, ఆటో లోన్‌, బిజినెస్‌ లోన్‌ ఇప్పిస్తామని చెప్పారా..? అయితే అలాంటి కాల్స్‌ వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలని, వాటితో మాకు ఎలాంటి సంబంధం లేద‌ని ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ పేరుతో నకిలీ సంస్థలు సృష్టించి రుణాల పేరుతో మోసగించిన ఘ‌ట‌న‌లు అనేకం గ‌తంలో వెలుగుచూశాయి. తాజాగా ఎస్‌బీఐ లోన్ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఒక ముఠా ఏకంగా ఓ సంస్థను పెట్టి అమాయకులను మోసం చేస్తున్నది. ఇటీవ‌ల అందుకు సంబంధించిన‌ ఉదాంతాలు కలకలం రేపుతున్నాయి. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా,సులువుగా రుణాలు ఇస్తామని నమ్మిస్తూ బురిడి కొట్టిస్తున్నారు. అలాంటి మోసాలు జరుగుతున్నట్లు ఎస్‌బీఐ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కస్టమర్లను హెచ్చరిక‌లు జారీ చేసింది.

ఎస్‌బీఐ లోన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ పేరుతో తమకు ఎలాంటి సంస్థ లేదని, అలాంటి సంస్థలతో తమకు ఏ సంబంధం లేదని ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది జనవరిలో కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఎస్‌బీఐ లోన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ పేరుతోనే కాదు, ఎస్‌బీఐ పేరు చెప్పుకొని మోసగాళ్లు కస్టమర్లను సంప్రదిస్తూ నిలువునా మోసగిస్తున్నారు. రుణాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారను. అంతేకాదు కస్టమర్లను నమ్మించేందుకు ఎస్‌బీఐ లోగో, బ్రాండ్‌ వాడుతున్నట్లు వెలుగులోకి వచ్చింద‌ని, అందుకే పదేపదే ఖాతా దారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్నామ‌ని ఎస్ బీఐ వివ‌రించింది. రుణాల పేరుతో వచ్చే కాల్స్‌ని పట్టించుకోవద్దని, ఎస్ఎంఎస్, మెయిల్స్‌లో వచ్చే లింక్స్ క్లిక్ పొరపాటున క్లిక్‌ చేయవద్దని, లేనిపోని లింకులను క్లిక్‌ చేసినట్లయితే సైబర్‌ మోసగాళ్ల చేతులు అడ్డంగా మోసపోతార‌ని ఎస్‌బీఐ హెచ్చరిస్తోంది.