దారుణం : భార్య పై కోపంతో బామ్మర్ది ఇంటికి నిప్పు..!?

ఒక తాగుబోతు పైశాచికత్వానికి ఏకంగా రెండు కుటుంబాలు బలయ్యారు. తన భార్య ఇంటికి రాను అందనే కోపంతో బావమరిది ఇంటిని తగల బెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహ్నం అవ్వగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. చనిపోయిన వారిలో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రోజు కూడా సాయంత్రం తన భార్యతో గొడవపడ్డాడు.

భర్త ఆగడాలను భరించలేకపోయిన భార్య బేబీ, కనూరులోనే ఉంటున్న తన సోదరుడు మంజు ఇంటికి పిల్లలతో సహా వెళ్ళిపోయింది. మద్యం మత్తులో ఉన్న బోజ, మంజు ఇంటికి వెళ్లి బేబీని తనతో రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీనితో కోపం చెందిన బోజ, అర్ధరాత్రి దాటిన తర్వాత మంజు ఇంటికి వెళ్లి బయట తాళాలు వేసి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. దానితో ఇరు కుటుంబ సభ్యులు మంటలో చిక్కుకుని చనిపోయారు. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.