డిజిటల్ టెక్నాలజీ ఆధునిక మానవుడి జీవనాన్ని సుఖప్రదం చేసింది. అదే విధంగా మరోవైపు అదే అనేక చిక్కులకు కారణమవుతున్నది. అందులోనూ సోషల్ మీడియా వచ్చాక మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాను కొందరు జీవిత ఉన్నతికి వినియోగించుకుంటుండగా చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు. ముఖ్యంగా యువత విలువైన సమయాన్ని వృథా చేసుకోవడమేగాక, పెడదోవ పడుతున్నది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని మహిళలను లైంగికంగా వేధిస్తూ, తప్పులకు పాల్పడుతున్నారు కొందరు యువకులు. చిన్న చిన్న కారణాలకు పగను పెంచుకొని జైలుపాలవుతున్నారు, అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించామని అడిగినందుకు కక్ష పెంచుకున్న ఓ మరది ఏకంగా తన వదిన ను కాల్ గర్ల్ గా మార్చేసాడు. వివరాల్లోకి వెళ్తే..
రంగారెడ్డి జిల్లా మార్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన నాగిళ్ల యశ్వంత్ (19 ) తనకు డబ్బు అత్యవసరం కాగా వరుసకు వదినయ్యే మహిళ వద్ద రూ. 2 వేలు అప్పు చేశాడు. ఇటీవల ఆ అప్పును తిరిగి చెల్లించమని ఆమె అడగడం మొదలు పెట్టేసరికి తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు. దీంతో మహిళ, ఆమె భర్త ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో వారు తమ కుమారుడిని మందలించారు. ఈ నేపథ్యంలో అన్న, వదినపై ఆ యువకుడు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వారి పరువు తీయాలనుకున్నాడు. అందులో భాగంగా “హయ్.. ఐయామ్ ఆంటీ.. నాకు పెళ్లయి.. ఒక కొడుకు ఉన్నాడు. కానీ .. నా భర్త ఒక వేస్ట్ ఫెల్లో .. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి” అంటూ వదిన ఫోన్ నెంబర్ ని షేర్ చాట్ లో కాల్ గర్ల్ గా అప్ లోడ్ చేశాడు. ఫోన్ నెంబర్ జత చేశాడు. దీంతో పగలు, రాత్రి మహిళకు ఆకతాయిల నుండి ఫోన్లు రావడం ఎక్కువయ్యాయి. ఆ కాల్స్ ని భరించలేని మహిళ పోలీసులను ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు యశ్వంత్ ని పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.