కోవిడ్‌పై పోరు..భారీ విరాళం ప్ర‌క‌టించిన‌ అమితాబ్‌!

సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ ప్రజ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి క‌నుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు ల‌క్ష‌ల సంఖ్య పాజిటివ్ కేసులు, వేల సంఖ్య మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి. స‌రైన స‌దుపాయాలు లేకే చాలా మంది మృత్యువాత ప‌డుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌..ఢిల్లీలోని రాకబ్ గంజ్‌ ప్రాంతంలోని గురుద్వారా ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న కరోనా సంరక్షణా కేంద్రానికి రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు.

ఈ విష‌యాన్ని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ప్రెసిడెంట్ మంజీన్దర్ సింగ్ సిర్సా వెల్ల‌డించారు. ఈ కేంద్రానికి విదేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు ఇతర వైద్య పరికరాలను కూడా తెప్పిస్తానని అమితాబ్ హామీ ఇచ్చార‌ని..ఆయ‌న మంచి మ‌న‌సుకు మా కృతజ్ఞతలని మంజీన్దర్ సింగ్ తెలిపారు. కాగా, 300 పడకలు గల ఈ కేంద్రం నేటి నుంచి ప్రారంభం కానుంది.