ఏపీ బాలిక‌కు కేసీఆర్ త‌న‌య సాయం..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య‌, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డంలో ముందుంటారు. కొవిడ్ స‌మ‌యంలో నిజామాబాద్ కేంద్రంలో నిర‌వ‌ధికంగా అన్న‌దానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్‌, మ‌స్క‌ట్ త‌దిత‌ర అర‌బ్ దేశాల్లో చిక్కుకున్న‌వారిని స్వ‌దేశానికి తీసుకురావ‌డానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్ర‌జాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ కు చేయూతనిచ్చిన ఎమ్మెల్సీ కవిత, వారి కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నింపారు.

ప్రకాశం జిల్లాకు చెందిన పదకొండు సంవత్సరాల చిమ్మల జ్ఞాపిక వెన్నెముక సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరింది. జ్ఞాపికకు న్యూరో సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన జ్ఞాపిక తల్లిదండ్రులకు దిక్కు తోచని స్థితి నెలకొంది. అయితే జ్ఞాపిక ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత గారి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ కవిత, జ్ఞాపిక కుటుబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి భరోసానిచ్చారు. జ్ఞాపిక కు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. నిమ్స్ వైద్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపిన ఎమ్మెల్సీ కవిత, జ్ఞాపికకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవతో, నిమ్స్ లో సర్జరీ పూర్తి చేసుకున్న జ్ఞాపిక, ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. జ్ఞాపిక ఆరోగ్యం కుదుటపడుతోందన్న తల్లిదండ్రులు, అన్ని రకాలుగా అండగా నిలిచిన ఎమ్మెల్సీ కవిత గారికి కృతజ్ఞతలు తెలిపారు.