ఏపీలో నేటి నుంచి వారికి వ్యాక్సిన్‌ పంపిణీ షురూ!

కంటికి క‌నిపించని క‌రోనా వైర‌స్ ఎన్ని తిప్ప‌లు పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఫ‌స్ట్ వేవ్‌తో పోలిస్తే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏపీలోనూ క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు ప‌దిహేను ల‌క్ష‌లు దాటిపోగా.. మ‌ర‌ణాల సంఖ్య ప‌ది వేలు దాటింది.

అయితే నేటి నుంచి 45 ఏళ్లు పైబడిన వారి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సారి పబ్లిక్ కాంటాక్ట్ ఉండేవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంటే రైల్వే, ఆర్టీసీ, బ్యాంక్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేయబోతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 13.13 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉండ‌గా.. వీటిలో 1.55 లక్షల కొవాగ్జిన్ టీకాలను రెండో డోసు కింద ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే, 11.58 లక్షల కొవిషీల్డ్ టీకాలను తొలి డోసుగా ఇస్తామన్నారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇక ప్రస్తుతానికైతే 18-45 లోపు వారికి టీకాలు ఇవ్వడం లేదు.