హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈటల రాజేందర్పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు ఉన్నారో వారందరికీ శిక్ష పడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హత్యలో పుట్ట మధుతో పాటు కమాన్పూర్ మార్కెట్ చైర్మన్ సత్యానారాయణ భాగస్వామ్యం కూడా ఉందని వామనరావు తండ్రి కిషన్ రావు ఆరోపించడం గమనార్హం. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ కేసులో ఈటల పేరు వెలుగులోకి వస్తుండడం రాజకీయ దుమారం రేపుతున్నది.
ఇదిలా ఉండగా వారం రోజులుగా కనిపించకుండా పోయిన పుట్టా మధును ఏపీలోని భీమవరంలో రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారింది. ఇక వామన్ రావు దంపతుల హత్య కేసులో పుట్టా మధుపై ఆరోపణలున్నా టీఆర్ఎస్ పార్టీ కింది స్థాయి నాయకులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది. పుట్టా మధును ఒకరకంగా సేఫ్ చేసింది. కానీ ఇప్పుడు ఇదే కేసులో అరెస్ట్ పుట్ట మధును అరెస్ట్ చేయడంపై తీవ్ర చర్చ కొనసాగుతున్నది. అయితే దీనికి వెనక అసల కథ వేరే ఉందని తెలుస్తున్నది. మాజీ మంత్రి ఈటల కొడుకు నితిన్ పేరును తెరపైకి తెచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. వారిద్దరికి వ్యాపార సంబంధాలున్నాయని, వామన్ రావు హత్యకు ముందు వారి మధ్య చెల్లింపులు జరిగినట్లుగా ప్రచారం సాగుతున్నది. ఇదే అంశంపై ఈటల కొడుకు నితిన్ ను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశమున్నట్లు సమాచారం. నిజానికి ఈటల, పుట్టా మధు మధ్య మంచి సంబంధాలున్నాయి. ఈటల పార్టీకి దూరమైన నేపథ్యంలోనే… మధు కూడా వీడుతాడనే ఉద్దేశంతోనే ప్రస్తుతం ఈ కేసును తోడుతున్నారని, ఈటలను నేరుగా ప్రశ్నిస్తే… సమస్య పెద్దదవుతుందని భావించే పరోక్షంగా ఆయన కొడుకును లక్ష్యంగా చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. మరి చివరకు ఈ కేసు మరెన్ని ట్వీస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.