ప్రముఖ క్రికెటర్ ఇంట్లో విషాదం…!

ఈ మధ్య టీమ్ ఇండియా క్రికెటర్ల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ ఇంట విషాదం నెలకొంది. ఈ మధ్యనే కరోనా వైరస్ బారినపడిన ఆయన తండ్రి శివ్ ప్రసాద్ సింగ్ బుధవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆర్పీ సింగ్ తన తండ్రి మరణ వార్తని అభిమానులకి తెలియజేశాడు. వారం వ్యవధిలోనే కరోనా కారణంగా తండ్రి కోల్పోయిన మూడో భారత క్రికెటర్ ఆర్పీ సింగ్ కావడం గమనార్హం. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియా తండ్రి కరోనా కారణంగా చనిపోయారు.

ఆ తర్వాత రోజు వ్యవధిలో స్పిన్నర్ పీయూస్ చావ్లా తండ్రి కూడా కరోనాతో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో సభ్యుడిగా ఉన్న ఆర్పీ సింగ్ కెరీర్‌లో 14 టెస్టులు, 58 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. గాయాలు, పేలవ ఫామ్ కారణంగా ఆ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి ఆర్పీ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.