ఏపీ మంత్రి ఇంట విషాదం..!

కరోనా టైంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల కుటుంబాల్లో కొందరు ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొందరు అనారోగ్యం వల్ల చనిపోతే మరికొందరు కరోనాకు బలైపోయిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం తన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

సూర్యనారాయణ మృతి పట్ల డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు అప్పలరాజు, మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాపం తెలియజేశారు. కాగా, వెల్లంపల్లి తండ్రి అంత్యక్రియలు విజయవాడ భవానీపురం పున్నమిఘాట్ హిందూ శ్మశాన వాటికలో నేడు నిర్వహించనున్నారు. ప్రస్తుతం సూర్యనారాయణ భౌతికకాయాన్ని మంత్రి వెల్లంపల్లి నివాసం వద్ద ఉంచారు. వెల్లంపల్లి ఇంట విషాదం నెలకొనడంతో అభిమానులు, కార్యకర్తలు విచారం వ్యక్తం చేశారు. వెల్లంపల్లి కుటుంబానికి సంతాపం తెలిపారు.