దేశంలో కరోనా బీభత్సం సృష్టిస్తుంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ని కూడా ప్రకటించాయి. ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ముందుగా 45 ఏళ్ల పై వయసున్న వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం, మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి కూడా వ్యాక్సీన్ని అందిస్తుంది. కానీ ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వృద్ధులకు, దివ్యాంగులకు చాలా కష్టంగా ఉంది. గంటల తరబడి క్యూ లో నిలబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో ముంబై, భోపాల్ ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు అక్కడ అధికారులు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఉన్న చోటుకే వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. కారులోనే, ఇతర వాహనాలలో ఉన్నా కూడా అక్కడే వాక్సిన్ అందిస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు సతీమణి నమ్రత మాట్లాడుతూ, అన్ని రాష్ట్రాల ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసింది. భోపాల్, ముంబైలోవ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతోంది. అది చాలా మంచి నిర్ణయం అని, మిగతా రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.