ప్రస్తుతం కరోనా రెండో వేవ్ వేగంగా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప మందుని పంపిణీ చేయడం లేదని తాజాగా బత్తిని హరినాథ్గౌడ్ తెలియచేసారు . 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం ప్రతి ఏడాది అందిస్తున్న చేప ప్రసాదాన్ని గత సంవత్సరం కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేక పోతున్నాము అని అన్నారు. మృగశిరకార్తె రోజున ప్రతి సంవత్సరం లానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసం దగ్గర సత్యనారాయణ ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి 8వ తేదీన చేప ప్రసాదాన్ని తయారు చేసి ఉదయం 10 గంటలకు తమ కుటుంబ సభ్యులకు ఇంకా బంధువులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు.
కరోనా కారణంగా ఈ సంవత్సరం కూడా చేప ప్రసాదం పంపిణీని తాము విరమించుకోవాల్సిందిగా మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సూచించారని హరినాథ్గౌడ్ తెలిపారు. రెండేళ్లుగా చేప ప్రసాదం అందకపోవడంతో అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.