ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో రెండవ హీరోయిన్గా నటించిన సంజనా గల్రానీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికే మాదక ద్రవ్యాల కేసుని ఎదుర్కొంటున్న ఈ అమ్మడిపై మరో కేసు నమోదైంది. అదీకూడా బెంగుళూరు కోర్టు ఆదేశం మేరకు బెంగుళూరు కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2019 డిసెంబరు 24న కన్నడ చిత్ర నిర్మాత వందన జైన్ కిస్మస్ పండగను పురస్కరించుకుని కొంతమంది సినీ సెలెబ్రిటీలకు ఓ లగ్జరీ క్లబ్లో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి సంజనా గల్రానీ కూడా హాజ రయ్యారు. ఈ పార్టీలో వందన, సంజన మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ సమయంలో నిగ్రహం కోల్పోయిన సంజన గల్రానీ… మద్యం బాటిల్తో వందనపై దాడి చేయడంతో చిన్నపాటి గాయమైంది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కబ్బన్ పార్క్ పోలీసు లకు వందన జైన్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు నమోదుచేసి రెండేళ్ళు గడిచినా పోలీసులు మాత్రం సంజనాపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో నిర్మాత వందన జైన్ తరపు న్యాయవాదులు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి సంజనాపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు, తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో స్పందించిన పోలీసులు సంజనపై కేసు నమోదు చేశారు.