టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ శిల్పా శెట్టిని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
కథను ఒక అనూహ్యమైన మలుపు తిప్పే ఈ పాత్ర కోసం సీనియర్ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని భావించిన త్రివిక్రమ్.. ఫైనల్గా శిల్పా శెట్టిని ఎంపిక చేశారని టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే.. ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కాగా, శిల్పా శెట్టిని గురించి పరిచయాలు అవసరం లేదు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సాహసవీరుడు సాగరకన్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో మూడు, నాలుగు సినిమాలే చేసిన శిల్పా బాలీవుడ్కే పరిమితం అయింది.