భారీ విరాళం అందించిన తలైవా..?

rajinikanth

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజల జీవితాలు అస్త‌వ్య‌స్తంగా మారిపోతున్నాయి. ఇక దినసరి కూలీలు, పేద‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. ప్రజలకు అండగా నిలిచేందుకు సెల‌బ్రిటీలు ముందుకు వ‌స్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు.

అయితే ఇప్ప‌టికే సూర్య‌, కార్తీ సోద‌రులు కోటి విరాళం అందించ‌గా, మురుగ‌దాస్ రూ. 25 ల‌క్ష‌లు, అజిత్ 25 ల‌క్ష‌లు, సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ భ‌ర్త విశాగ‌ణ్ కోటి రూపాయ‌లు , ద‌ర్శ‌కుడు వెట్రిమార‌న్ ,రూ.10 ల‌క్షలు, ఎడిట‌ర్ మోహ‌న్, ఆయ‌న త‌న‌యుడు మోహ‌న్ రాజా, జ‌యం ర‌వి రూ. 10 ల‌క్ష‌ల రూపాయ‌లు, త‌మిళ న‌టుడు శివ కార్తికేయ‌న్ విరాళం కింద పాతిక ల‌క్ష‌లు, శంక‌ర్ రూ. 10 ల‌క్ష‌ల రూపాయలు అందించారు.

ఇక తాజాగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ని క‌లిసి రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళం అందించారు. కాగా, ర‌జ‌నీకాంత్ 35 రోజుల పాటు హైద‌రాబాద్‌లో అన్నాత్తె షూటింగ్ చేయ‌గా, రీసెంట్‌గా ప్ర‌త్యేక ఫ్లైట్‌లో హైద‌రాబాద్ నుండి చెన్నైకు వెళ్లారు. సోమవారం వీలు చూసుకొని సీఎంను క‌లిసి విరాళం అందించారు.