`ఉప్పెన` హీరోకు క‌రోనా క‌ష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న వైష్ణ‌వ్ త‌న రెండో చిత్రాన్ని క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. ఉప్పెన విడుద‌ల‌కు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కొండ‌పొలం అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి క‌రోనా క‌ష్టాలు ప‌ట్టుకున్నాయి. షూటింగ్ త‌ర్వాత అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల చేద్దాము అనుకున్న స‌మ‌యానికి సెకెండ్ వేవ్ రూపంలో క‌రోనా ముంచుకొచ్చింది.

ఇలాంటి స‌మ‌యంలో ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేసే ప‌రిస్థితి లేదు. అందుకే ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ చిత్రాన్ని ఓటీటీ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ చిత్రానికి 15 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంద‌ని.. అన్నీ కుదిరితే త్వ‌ర‌లోనే ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.