మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేశాడు. ఉప్పెన విడుదలకు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.
ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్ను అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి కరోనా కష్టాలు పట్టుకున్నాయి. షూటింగ్ తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల చేద్దాము అనుకున్న సమయానికి సెకెండ్ వేవ్ రూపంలో కరోనా ముంచుకొచ్చింది.
ఇలాంటి సమయంలో ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసే పరిస్థితి లేదు. అందుకే దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని ఓటీటీ విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ చిత్రానికి 15 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉందని.. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది.