టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. తాను వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. అందరూ జాగ్రత్తగా ఉండాలని, సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించాడు. వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కోసం భారత జట్టు త్వరలోనే ఇంగ్లాండ్ కు వెళ్లనుంది. ఆలోపే ఆ టూరుకు వెళ్లే భారత జట్టులోని ఆటగాళ్లందరూ తమ తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోవాలని భావిస్తున్నారు.
భారత పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ తన భార్య ప్రతిమా సింగ్ తో కలిసి వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఇప్పటికే శిఖర్ ధావన్, రహానే, ఉమేష్ యాదవ్ కూడా కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నారు. ఐపీఎల్ వాయిదా పడగానే ఇంటికెళ్లిపోయిన కోహ్లీ.. ఆ వెంటనే కొవిడ్ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తనవంతుగా రూ.2 కోట్లు విరాళమిచ్చాడు. భార్య అనుష్క శర్మతో కలిసి మరిన్ని విరాళాలు సేకరిస్తున్నాడు.