మ‌ళ్లీ అక్క‌డికే షిఫ్ట్ అవుతున్న ప్ర‌భాస్‌ `ఆదిపురుష్‌`!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుస్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో రాముడుగా ప్రభాస్‌, సీతగా బాలీవుడ్ భామ‌ కృతి సనన్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు.

ఈ సినిమాను టీ సిరీస్ బ్యాన‌ర్ పై భూష‌ణ్ కుమార్, ప్ర‌సాద్ సుతార్‌, రాజేశ్ నాయ‌ర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య ముంబైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే అంతలోనే ముంబైలో క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డ‌టంతో.. అక్క‌డ లాక్‌డౌన్ విధించారు.

దాంతో ఆదిపురుష్ టీమ్ హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చేశారు. కానీ, ఇక్క‌డ కూడా లాక్‌డౌన్ విధించ‌డంతో ఆదిపురుష్ షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ షూట్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. అయితే హైద‌రాబాద్‌లో కాకుండా.. మ‌ళ్లీ ముంబైకే షిఫ్ట్ అయ్యి అక్క‌డే త‌దుప‌రి షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌.